యోగా సర్వరోగనివారిణి

అపోహలను అధిగమించి యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడం అందరి
బాధ్యతగా రూపొందాలని రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ సెక్రెటరీ శిద్దా హనుమంత రావు
పిలుపునిచ్చారు. యోగాను కేవలం వ్యాయామమని, పూజ సంబంధ ప్రక్రియ అని పొరపాటుగా అర్థం
చేసుకోకూడదని ఆయన సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైజ్ కృష్ణసాయి
గ్రూప్ రైజ్ ఇండియా ఆడిటోరియంలో ఎన్.ఎస్.ఎస్. విభాగంవారు మంగళవారంనాడు ఏర్పాటు
చేసిన యోగాభ్యసన కార్యక్రమంలో శిద్దా హనుమంత రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
యోగా ద్వారా వెలకట్టలేని ఆరోగ్యాన్ని స్వంతం చేసుకోవడంపై దృష్టి సారించాలని ఆయన
విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ధ్యాన ఫౌండేషన్ యోగా నిపుణులు, శిక్షకులు సురేంద్ర
గురూజీ, గుమ్మడి శ్రీరామ మూర్తి యోగా ప్రాముఖ్యతను వివరించారు. వివిధ ఆసనాలను
అభ్యసించాల్సిన పద్ధతులు, వాటి ప్రయోజనాలను తెలియజేశారు. ఒక్కొక్క ఆసనాన్ని విడమరచి
చెప్పడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయమే సిద్ధపడి యోగా కార్యక్రమంలో
పాల్గొన్న విద్యార్థులను నిపుణులు అభినందించారు. రైజ్ ఎన్.ఎస్.ఎస్.(NSS) విభాగం అధికారి
ప్రొఫెసర్ సంపత్ సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో మేనేజ్ మెంట్, ఫ్యాకల్టీ, అధ్యాపకేతర
సిబ్బంది, వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.